byసూర్య | Thu, Mar 28, 2024, 02:40 PM
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు పేరును హైకమాండ్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. సీఎం రేవంత్ ను ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిసిన నీలం మధు.. జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహతో కూడా భేటీ అయ్యారు. గత ఎన్నికల సమయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధును కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. జిల్లా నేతలు, ముఖ్యంగా దామోదర్ రాజనర్సింహ ఒత్తిడితో కాట శ్రీనివాస్ గౌడ్ కు బీఫామ్ ఇచ్చింది. దీంతో నీలం మధు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల తర్వాత నీలం మధు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు.టికెట్ కోసం సీనియర్ నేత జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు కూడా పోటీ పడ్డా.. చివరకు నీలం మధు వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. రేవంత్ రెడ్డి ఆశిస్సులతోనే ఆయనకు టికెట్ దక్కిందన్న ప్రచారం సాగుతోంది. అయితే.. జిల్లాలో అందరినీ కలుపుకుని వెళ్లాలన్న పార్టీ పద్దల సూచనలతో దామోదర్ రాజనర్సింహను కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. తనను మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంలో సహకరించిన మంత్రి దామోదర్ కు రుణపడి ఉంటానన్నారు.