byసూర్య | Fri, Mar 01, 2024, 07:58 PM
మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దాదాపు నాలుగు వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. ఈ బస్సుల్లో సుమారు 20 లక్షల మంది భక్తులు ప్రయాణించారు. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఎనిమిది రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు మేడారానికి రాకపోకలు సాగించాయి. భారీగా వచ్చిన భక్తులు, రహదారులపై ట్రాఫిక్ జామ్ వంటి సవాళ్ల నడుమ భక్తులను సురక్షితంగా మేడారం జాతర ప్రదేశానికి, తిరిగి వారి గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చింది. ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకు నగదు అవార్డు ఇవ్వాలని రోడ్డు రవాణా సంస్థ గురువారం నిర్ణయం తీసుకుంది.
ఒక్కో డ్రైవర్, ఎస్డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు అందజేయనునున్నారు. ఇక, జాతరతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. అటు, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో వారే కాక కుటుంబమంతా ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. దీంతో జాతర సర్వీసుల్లో సగటున 98శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడిపారు.