byసూర్య | Tue, Feb 20, 2024, 07:29 PM
హైదరాబాద్ అంటేనే.. నిత్యం ఉరుకులు పరుగుల జీవితం. ప్రపంచంతో పోటీ పడుతూ పగలూ రాత్రి తేడా లేకుండా పని చేస్తున్న నగరవాసులతో.. అర్ధరాత్రి కూడా రోడ్లు బిజీబిజీగా ఉంటాయి. ఇంటి నుంచి ఆఫీసుకు, ఆఫీసు నుంచి ఇంటికి ఇలా.. గమ్యం చేరేందుకు రకరకాల వాహనాల్లో ప్రయాణాలు చేస్తుంటారు. ఏ వాహనమైతే ఏంటీ.. తొందరగా గమ్యం చేరామా లేదా అన్నదే ముఖ్యం అన్నదే ఆలోచిస్తుంటారు జనాలు. అయితే.. ఎప్పుడూ.. బైకులు, కార్లు, బస్సులు మాత్రమే కనిపించే హైదరాబాద్ రోడ్లపై ఉన్నట్టుండి.. ఎడ్లబండి దర్శనమిచ్చింది. అది కూడా ఎప్పుడూ రద్దీగా ఉంటే హైటెక్ సిటీ దగ్గర. ఎప్పుడో పల్లెల్లోకి వెళ్లినప్పుడో, లేదా సంక్రాతి పండక్కి శిల్పారామంలో మాత్రమే ఎడ్లబండ్లు చూసే హైదరాబాద్ జనాలకు సడన్గా.. ట్రాఫిక్లో ఎడ్లబండి కనిపించేసరికి ఎగ్జైట్ అయిపోయారు.
హైటెక్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ రైతు ఎడ్లబండితో కనిపించాడు. గడ్డిని బండిలో తరలిస్తున్నాడు. అయితే.. సిగ్నల్ పడటంతో.. ట్రాఫిక్లో ఆగిపోయాడు. దీంతో.. అక్కడే ఉన్న వాహనదారులు ఆ ఎడ్లబండిని వింతగా చూస్తూ.. అదేదో బ్రహ్మపదార్థమన్నట్టుగా ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. ఈ పోస్టు కాస్త వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒకరేమో.. "రాజు ఎక్కడున్నా.. రాజే రా" అంటూ రైతునుద్దేశించి బాహుబలి డైలాగ్ కొడితే... ఐటీ పార్కు వద్దకు రైతు పోలేదు.. రైతు వద్దకే ఐటీ పార్కు వచ్చిందంటూ మరొకరు కామెంట్ చేశారు. రైతు ఎంట్రీతో సైబర్ టవర్కే అందం వచ్చిందంటూ ఇంకొందరు కామెంట్లు చేశారు. ఖరీదైన కార్లు తిరిగే రోడ్లపై ఎడ్లబండి దర్శనమివ్వడం.. గొప్ప విషయమంటూ మరికొందరు హర్షం వ్యక్తం చేశారు.