byసూర్య | Tue, Feb 20, 2024, 07:24 PM
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలిరానున్నారు. అయితే జాతరకు వెళ్లేవారి కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని డిపోలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కూడా వందల సంఖ్యలో ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతోంది. గ్రేటర్ జోన్లో ఆర్టీసీ 2,8500 బస్సులు నడుపుతుండగా.. వాటిలో దాదాపు 2 వేల బస్సులను మేడారానికి కేటాయించింది. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో నిత్యం 21 లక్షల మంది ప్రయాణాలు సాగిస్తారని అంచనా.
అయితే ఇన్ని వందల బస్సులు ఒకేసారి తగ్గిపోవడంతో హైదరాబాద్ నగరవాసులకు ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు, ఇతర పనుల మీద బయటకు వెళ్లేవారు బస్సుల కోసం ఆర్టీసీ బస్టాపుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అటు మియాపూర్ నుంచి అటు హయత్ నగర్ వరకు అన్ని బస్టాపుల్లోనూ బస్సుల కోసం ప్రయాణీకులు ఎదురుచూపులు చూస్తున్నారు. సమయానికి బస్సులు రాక గంటల తరబడి వేచి చూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోన్న మాట వాస్తవమేనని.. పెద్ద మనసుతో తమకు సహకరించాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. 'తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం.
రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నాం. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది.
దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.