byసూర్య | Tue, Feb 20, 2024, 07:21 PM
కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్లో ఇవాళ ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 10 సిలిండర్ పేలిపోగా.. 20 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. దేవుడికి పెట్టిన దీపం అగ్ని ప్రమాదానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఆదర్శ నగర్ ప్రాంతాంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే కొందరు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారందరూ మేడారం జాతరకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జాతరకు వెళ్లే ముందు ఇంట్లో దేవుడికి దీపం పెట్టి తాళాలు వేసుకొని బయల్దేరారు. ఆ దీపం గుడిసెలకు అంటుకుని వేగంగా మంటలు వ్యాపించాయి.
అందరూ చూస్తుండగానే 10 సిలిండర్లు బ్లాస్ట్ అయ్యాయి. క్షణాల్లో 20 గుడిసెలు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. భారీ శబ్ధాలు రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన కార్మికులు ఆదర్శనగర్లోని ఈ ప్రాంతంలో 20 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వారంతా కుటుంబాలతో సహా మేడారం జాతరకు వెళ్లడంతో భారీ ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.