సీపీఐ నాయకుల కుట్ర వల్లే ఓడిపోయా: పోదెం వీరయ్య

byసూర్య | Wed, Dec 06, 2023, 07:09 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ 8 చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా.. కొత్తగూడెంలో దాని మిత్రపక్షమైన సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు గెలిచిన సంగతి తెలిసిందే. భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ జెండా ఎగురేసింది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యపై బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. పొంగులేటి వర్గానికి చెందిన వెంకట్రావు.. శ్రీనివాస్ రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరారు. కానీ వెంటనే యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్‌లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


అయితే తన ఓటమికి పువ్వాడ అజయ్ బంధువులైన సీపీఐ నేతలే కారణమని పోదెం వీరయ్య ఆరోపించారు. తాను గెలుస్తానని సర్వేలు వెల్లడించాయని.. తనకు ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని వీరయ్య తెలిపారు. అయితే అంతా సానుకూలంగా ఉన్న సమయంలో.. ఎన్నికలు నాలుగు రోజులు ఉన్నాయనగా.. సీపీఐ నేతలు రావులపల్లి రామ్ ప్రసాద్, రావులపల్లి రవికుమార్ బీఆర్ఎస్‌లో చేరారని.. వారు సీపీఐ కేడర్‌ను తమతోపాటు బీఆర్ఎస్‌లో చేర్పించడంతో.. తాను ఓడిపోవాల్సి వచ్చిందని వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు.


పువ్వాడ అజయ్‌తో బంధుత్వం ఉన్న ఈ సీపీఐ లీడర్లు ఆయనతో కుమ్మక్కై భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో తనను దొంగ దెబ్బ తీశారని కాంగ్రెస్ నేత ఆరోపించారు. తాను గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి లేదా మంత్రి పదవి వస్తుందని భావించి, స్వార్థ రాజకీయాలతో కుట్ర పన్ని ఓడించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 36 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్నానని.. 2018 ఎన్నికల్లో గెలిచిన తనకు బీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు ఆశ చూపినప్పటికీ.. పార్టీ మారలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో వెన్ను దన్నుగా ఉన్న తనను గుర్తించి.. అధినాయకత్వం సముచిత స్థాన కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పోదెం వీరయ్య తెలిపారు.


ఆరుగురు గెలిస్తే.. ఇద్దరే మిగిలారు..


2018లోనూ ఖమ్మం జిల్లాలో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ గెలవగా.. భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య, మధిర ఎమ్మెల్యే భట్టి మాత్రమే చివరి వరకూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా దీంతో 2023 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించింది. ఈసారి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి కచ్చితంగా లభించేది. కానీ దురదృష్టవశాత్తూ 5719 ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. కాగా సీపీఐ (మార్కిస్ట్) తరఫున పోటీ చేసిన కరం పుల్లయ్యకు 5860 ఓట్లు పడటం గమనార్హం.


Latest News
 

వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM
డీజీపీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు Thu, Sep 19, 2024, 08:18 PM
వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్న మహేశ్ కుమార్ గౌడ్ Thu, Sep 19, 2024, 08:07 PM
విఎస్టీ స్టీల్ బ్రిడ్జిపై యువత బైక్ రేసింగ్ Thu, Sep 19, 2024, 08:00 PM