byసూర్య | Sun, Dec 03, 2023, 01:46 PM
రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వసాధారణమే. ఒక పార్టీలో నెగ్గి.. మరో పార్టీ కండువా కప్పేసుకోవడం ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా జరుగుతుంటుంది. అలా.. పోటీ చేసిన ఫిరాయింపుదారులకు తెలంగాణ ఓటర్లు ఈ ఎన్నికల్లో గట్టి షాకే ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ మీద పోటీ చేసి నెగ్గి.. మరో పార్టీలోకి వెళ్లి.. ఇప్పుడు మారిన పార్టీ మీద పోటీ చేసిన అభ్యర్థులు బొక్కబోర్లాపడ్డారు. పలు నియోజకవర్గాల్లో ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు.. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వాళ్లకు బీఆర్ఎస్ అధిష్టానం మళ్లీ 2023 ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చింది. కానీ, ఆ ఫిరాయింపుదారుల్ని ఓటర్లు నిర్మోహమాటంగా తిరస్కరించారు.
మెచ్చా నాగేశ్వరరావు
ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేటలో గతంలో మెచ్చా నాగేశ్వరరావు (టీడీపీ) తరఫున గెలుపొందారు. తర్వాత ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఆయన బీఆర్ఎస్ తరఫునే పోటీకి దిగారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణకు ఓటర్లు పట్టం కట్టారు. ఫిరాయింపుదారి నాగేశ్వరరావుపై ఆది నారాయణ ఏకంగా 28,358 ఓట్లతో గెలుపొందారు.
కోరుకంటి చందర్
రామగుండం నియోజకవర్గంలో 2018లో కోరుకంటి చందర్(ఫార్వర్డ్ బ్లాక్) నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఈసారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చందర్ పోటీ చేయగా.. రామగుండం ప్రజలు ఆయన్ని ఓడించారు. ఫిరాయింపుదారి కోరుకంటి చందర్పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ ఠాకూర్ 40 వేల ఓట్ల బంపర్ మెజార్టీతో గెలుపొందారు.