byసూర్య | Sun, Sep 24, 2023, 07:03 PM
హైదరాబాద్ పాతబస్తీలోని ఓ గణేష్ మండపంలో లడ్డూ చోరికి గురైంది. వినాయకుడి చేతిలోని 21 కిలోల లడ్డూను స్కూల్ పిల్లలు ఎత్తుకెళ్లారు. దీంతో మండపం నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. చార్మినార్ పీఎస్ పరిధిలోని ఝాన్సీ బజార్ ప్రాంతంలో శ్యామ్ అగర్వాల్ అనే వ్యక్తి వినాయక మండపం ఏర్పాటు చేశాడు. గణపతి చేతిలో దాదాపు 21 కేజీల లడ్డూను ఉంచి గత ఐదు రోజులుగా ఘనంగా పూజలు చేస్తున్నాడు.
అయితే శనివారం సాయంత్రం కొందరు స్కూల్ స్టూడెంట్స్ గణపతి చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లిపోయారు. స్థానికంగా ఉంటే కొందరు స్కూల్ పిల్లలు సాయంత్రం బడి ముగిశాక ఇంటికి బయల్దేరారు. దారిలో వారికి గణేష్ మండపం చేతిలో లడ్డూ కనిపిచటంతో కొందరు స్టూడెంట్స్ మండపంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత గణేషుడి చేతిలోని లడ్డూను ఎత్తుకెళ్లిపోయారు. అనంతరం లడ్డూను సమానంగా పంచుకొని తినేశారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఘటనపై మండపం నిర్వహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తెలుగు రాష్ట్రాల్లో వినాయకుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. ఆయన చేతిలో లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. గణేషుడితో పాటు.. ఆయన చేతిలో పెట్టే లడ్డు కూడా నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. ఆ లడ్డునూ నవరాత్రుల చివరి రోజు వేలం వేస్తారు. లక్షల్లో వేలం పాడి కొందరు లడ్డూను దక్కించుకుంటారు. లడ్డూను దక్కించుకున్న కుటుంబానికి సిరిసంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసిస్తారు. అయితే నగరంలో గత కొన్ని రోజులుగా మండపాల్లో లడ్డూలు చోరీకి గురవుతున్నాయి. రెండ్రోజుల క్రితం మియాపూర్లోనూ ఓ మండపంలో లడ్డూ చోరికి గురైంది. ఓ దొంగ అర్ధరాత్రి దాటిన తర్వాత మండపంలో ప్రవేశించి లడ్డూను ఎత్తుకెళ్లిపోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.