byసూర్య | Sun, Sep 24, 2023, 07:04 PM
హైదరాబాద్ చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బట్టలు ఆరేసి వైర్ మెడకు చుట్టుకొని ఓ బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ ఉండగా.. ప్రమాదవశాత్తు వైర్ మెడకు బిగుసుకొని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిస్సు కర్మ రామ్జీ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి చందానగర్ భవానీ పురంలో నివాసం ఉంటున్నారు. అతడు స్థానికంగా కార్పెంటర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కుమారుడు బిస్సు కర్మ కునాల్ (12) స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో భార్య పూజాదేవి ఛాతీలో నొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లాలని భర్తకు ఫోన్ చేసి కోరింది. తాను రెడ్డికాలనీలోని కమ్యూనిటీహాల్ దగ్గర ఉంటానని రమ్మని చెప్పింది. అక్కడికి వచ్చి భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే 7 గంటల సమయంలో పక్కింట్లో ఉండే వ్యక్తి ఫోన్ చేసి కునాల్ చనిపోయినట్లు చెప్పారు. బట్టలు ఆరేసి తీగ మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వారు వచ్చి బాలుడిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలుడు ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు