byసూర్య | Sat, Sep 23, 2023, 06:23 PM
ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ప్రస్తుతం మరో వివాదంలో చిక్కుకున్నారు. పబ్లింక్ మీటింగ్లో రైతుల గురించి మాట్లాడుతూ ఒక్కసారిగా నోరు జారి సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయారు. అది ఎవరో కాదు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.. అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పుసుక్కున నోరు జారారు. "దేశానికి అన్నం పెట్టే రైతులు ఆకలితో చావొద్దు.. రైతులు ఆత్మహత్య చేసుకొని చావాలి".. అంటూ వివాదాస్పదన వ్యాఖ్యలు చేశారు. అందుకోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. దీంతో.. ఎమ్మెల్యే మాటలు సర్వత్రా దుమారం రేపుతున్నాయి.
అయితే.. దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలితో చావకూడదని.. ఆత్మహత్యలు చేసుకుని చావకుండా ఉండేందుకు.. కేసీఆర్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పబోయి.. దుర్గం చిన్నయ్య నోరుజారినట్టు అర్థమవుతోంది. కానీ.. దుర్గం చిన్నయ్య నోరుజారిన వీడియోను కొంతమంది కట్ చేసి సోషల్ మీడియాల్లో పెట్టటంతో.. అది కాస్త వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పబ్లిక్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా.. ఆచీతూచీ మాట్లాడాలని.. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకూడదంటూ చురకలంటిస్తున్నారు.
ఇప్పటికే దుర్గం చిన్నయ్యపై కీలక ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దుర్గం చిన్నయ్యపై లైగింక ఆరోపణలు చేస్తూ.. ఆమె పలుమార్లు ఆత్మహత్యకు కూడా యత్నించారు. పోలీస్ స్టేషన్లతో పాటు ఢిల్లీకి వెళ్లి మహిళా కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. మొన్న బీఆర్ఎస్ జాబితా విడుదల చేసినప్పుడు కూడా.. ఆ కామపిశాచికి మళ్లీ టికెట్ ఎలా ఇస్తారంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది శేజల్. ఆ ఆరోపణలకు తోడు.. ఇప్పుడు రైతులపై చేసిన వ్యాఖ్యలతో.. ఆయనపై మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.