byసూర్య | Fri, Jan 27, 2023, 09:18 PM
చిన్న విషయాలే అయినా కొన్ని సందర్భాలలో అవి పెద్ద రాద్దాంతంగా మారుతుంటాయి. ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకొంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శివారులోని ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఉన్న ఓ చిన్న హోటల్లో పోచారం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు టీ తాగుదామని వెళ్లారు. హోటల్ సిబ్బంది ఇచ్చిన చాయ్ చల్లగా ఉండటంతో వాళ్లకు ఎక్కడలేని కోపం తన్నుకువచ్చింది. ఇదే విషయంపై హోటల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది.
అలా మొదలైన లొల్లి.. ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవలో ఆ గ్రామస్థులు హోటల్పై దాడికి దిగారు. అద్దాలు ధ్వంసం అయ్యాయి. హోటల్లోని సామగ్రి మొత్తం ధ్వంసం అయ్యింది. అక్కడితో ఆగకుండా.. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్కు చేరింది. ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇదే విషయంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఒక సింగిల్ టీ.. ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లిందంటే మామూలు విషయం కాదు. కాదేదీ గొడవకు అనర్హం అన్నది ఈ ఘటనలో నిరూపితమవుతోంది.