![]() |
![]() |
byసూర్య | Wed, Aug 17, 2022, 08:17 PM
కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిచేందుకు వెళ్లిన తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్ల పరిశీలనకు వెళ్తున్న ఆయన్ని భూపాలపల్లి వద్ద పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. భద్రాచలం పరిధిలోని గోదావరి పరీవాహక ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న భట్టీ నేతృత్వంలోని సీఎల్పీ బృందాన్ని మంగళవారం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. వరద బాధితులను పరామర్శించడంతో పాటు గత నెలలో భారీ వరదల కారణంగా మునిగిపోయిన కాళేశ్వరం మోటార్ల పరిశీలనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈరోజు మరోసారి ఆయన కాళేశ్వరం వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద 144 సెక్షన్ అమల్లో ఉందని.. అక్కడికి ఎవరు వెళ్లకూడదన్న ఆదేశాలతో భట్టి విక్రమార్కను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీడియాతో మాట్లాడిన భట్టి విక్రమార్క... కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం తమను అడ్డుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోతే చూసేందుకు మమ్మల్ని వెళ్లనివ్వరా.. టెర్రరిస్టుల మాదిరిగా అడ్డుకుంటారా? అని పోలీసులపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్ష పార్టీలకు పర్యటనలు చేసే హక్కు లేదా? అని నిలదీశారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా మునిగిన మోటార్ల పరిశీలనతో పాటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తామని చెప్పారు. ముంపు ప్రాంతాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.