byసూర్య | Sat, May 14, 2022, 11:36 AM
హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేసిన విషయం విదితమే. తన న్యాయవాదితో బండి సంజయ్ కి కేటీఆర్ ఈ నోటీసులు పంపారు. ఈనెల 11న ట్విట్టర్లో కేటీఆర్ పై బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. ఈ నోటీసుల పై తాజాగా బండి సంజయ్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ ఘాటుగా స్పందించారు. కేటీఆర్ వల్ల తెలంగాణలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయారంటూ బండి సంజయ్ చేసిన ట్వీట్ ఆధారంగానే ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై దమ్ముంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. సీబీఐ విచారణ జరిగితే విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులెవరో తెలుస్తుంది కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే హామీలిచ్చి మోసం చేస్తున్న మీ పై 420 కేసులు నమోదు చేయాలంటూ సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.