byసూర్య | Sat, Jun 12, 2021, 11:47 AM
ఈనెల 14న బీజేపీలో చేరికకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. కాసేపట్లో స్పీకర్కు అధికారికంగా రాజీనామా పత్రం సమర్పించనున్నారు. ముందుగా ఈటల రాజేందర్ శనివారం ఆయన అనుచరులతో కలసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేశానని తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్లో జరిగే ఎన్నికలు కురుక్షేత్రమేనన్నారు. కేసీఆర్ దగ్గర రూ.వందల కోట్లు ఉన్నాయని, అధికార దుర్వినియోగం చేసి ఉపఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు ఘోరి కట్టడమే తన అజెండా అని అన్నారు. హుజూరాబాద్లో గెలిచి ఆత్మగౌరవాన్ని నిలబెడతానని ఈటల తెలిపారు.