byసూర్య | Fri, Apr 09, 2021, 02:25 PM
తెలంగాణలో మరో ప్రముఖ టెక్స్ టైల్ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలో రెడీమేడ్ వస్త్రాల తయారీలో మంచి పేరున్న గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రగతి భవన్ లో టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖ ఉన్నతాధికారులతో గోకల్ దాస్ కంపెనీ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సిరిసిల్లలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న అప్పారెల్ పార్కులో ఈ కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించనుంది. శుక్రవారం గోకల్ దాస్ ఇమేజెస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుమిర్ హిందూజా మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమ పెట్టుబడి కార్యాచరణను వివరించారు. తమ కంపెనీ కార్యకలాపాల ద్వారా నేరుగా సుమారు 1100 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఇందులో మహిళలకు 75 శాతం ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. సిరిసిల్లలో ప్రారంభించబోయే ఫ్యాక్టరీ నుంచి అమెరికా, యూరప్ లోని ప్రముఖ బ్రాండ్ లకు దుస్తులను అందిస్తామన్నారు. గోకల్ దాస్ కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కంపెనీ కార్యకలాపాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామన్నారు.