byసూర్య | Fri, Oct 16, 2020, 12:43 PM
భారీ వర్షాల నేపథ్యంలో నగర శివార్లలోని గగన్పహాడ్ వద్ద అప్ప చెరువుకు గండి పడటంతో హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతిన్న విషయం విదితమే. గత రెండు రోజుల నుంచి జాతీయ రహదారి 44పై పోలీసులు పూర్తిగా రాకపోకలు నిషేధించారు. రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి.. ఆ హైవేను శుక్రవారం ఉదయం నుంచి పునరుద్ధరించారు. హైవేపై ఒకే మార్గంలో రాకపోకలకు అనుమతిచ్చారు అధికారులు. సాయంత్రం వరకు ఇరువైపులా రాకపోకలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఆరాంఘర్ నుంచి శంషాబాద్ వైపు యధావిథిగా రాకపోకలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ - బెంగళూరు హైవే మరమ్మతు పనులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ కలిసి ఇవాళ ఉదయం పరిశీలించారు. సాయంత్రం వరకు రోడ్డు మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. వాహనదారులు, ప్రయాణికులు పోలీసులకు సహకరించాలని కోరారు. అప్పచెరువు అడ్డుకట్ట పనులు కూడా వేగవంతం చేశామని, రెండు మూడు రోజుల్లో అడ్డుకట్ట పూర్తిగా వేస్తామని తెలిపారు. మూడు రోజుల నుంచి విరామం లేకుండా పోలీసులు, అధికారులు పనులు చేస్తున్నారని చెప్పారు.