byసూర్య | Mon, Oct 12, 2020, 03:46 PM
ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణకు కార్యాచరణ రూపొందించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల్లో కోర్టులు రంగం సిద్ధం చేసి విచారణ చేపడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4859 కేసులు పెండింగ్లో ఉండగా.. తెలంగాణలో 143 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అయితే, ప్రజా ప్రతినిధులపై కేసుల్లో నాంపల్లి స్పెషల్ సెషన్స్ కోర్టు విచారణ చేపట్టింది. ఇకపై రోజువారి విచారణ చేపట్టనున్నారు. కేసుల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా అంతా హాజరుకావాల్సి ఉంటుంది. అయితే, ఇవాళ నాంపల్లి కోర్టుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే (టీఆర్ఎస్) రసమయి బాలకిషన్, నేరెళ్ళ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాశిపేట లింగయ్య, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తదితరులు... నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.