byసూర్య | Fri, Oct 09, 2020, 06:27 PM
తన నియోజక వర్గమైన సనత్ నగర్ ను అభివృద్ధి చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ లలో సుమారు 1.50 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్లు నామన శేషుకుమారి, కొలన్ లక్ష్మి లతో కలిసి ప్రారంభించారు. ముందుగా అమీర్ పేట డివిజన్ లోని లీలానగర్ లో 22 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కమిటీ హాల్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. బుద్దనగర్ లో 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కమిటీ హాల్ ను ప్రారంభించారు.
బల్కంపేట కమిటీ హాల్ వద్ద 19.70 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న స్టార్మ్ వాటర్ లైన్ పనులను ప్రారంభించారు. అనంతరం బాపునగర్ లోని సాయి వీరహనుమాన్ దేవాలయం వద్ద 19.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విడిసిసి రోడ్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా సనత్ నగర్ డివిజన్ లోని స్వామీ టాకీస్ రోడ్ లో గల బెంగుళూరు అయ్యంగార్ బేకరీ వద్ద 41 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విడిసిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు.
తులసినగర్ లో 9 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.