byసూర్య | Sun, Mar 29, 2020, 05:06 PM
కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. కనిపించని శత్రువుతో చేస్తున్న పోరాటం మానవాళిని స్వీయ నియంత్రణలోకి నెట్టింది. లాక్ డౌన్ కారణంగా అత్యవసర సేవలు మినహా అన్ని రంగాలు పూర్తిగా స్థంభించాయి. ఫలితంగా జనజీవనం నానా అవస్థలు పడుతోంది. కోవిడ్ 19 కారణంగా జరుగుతున్న మరణాలకు తోడు ఆకలి చావులు, ఆత్మహత్యలూ అదికమవుతున్నాయి. బీహార్ లో 11 సంవత్సరాల రాహుల్ ముశహర్ అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతూ సరైన తిండిలేక ఆకలితో మరణించాడు. ఇదీ... దేశంలో పొంచి ఉన్న ప్రమాదానికి సంకేతం. రోజు కూలీలు ఆకలితో అలమటిస్తుంటే.. ఇంకొందరు కరోనా భయంతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కరోనా కోసిందనే భయంతో గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కరివిరాల గ్రామంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు... కరోనా కారణంగా మద్యం షాపులు, బార్లు మూసివేయడంతో మద్యానికి బానిసైన వాళ్లు మందు దొరక్క మానసిక సమతుల్యత కోల్పోతున్నారు. కేరళా రాష్ట్రంలోని త్రిశూర్లో మద్యం దొరక్క ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడమే అందుకు నిదర్శనం. పరిస్థితి చేయిదాటుతుండడంతో మద్యానికి బానిసైన వాళ్లు డీ అడిక్షన్ సెంటర్లను సంప్రదిస్తున్నారు. ఇప్పుడు కరోనాతో పోరాడడం మాత్రమే కాదు.అసహజ మరణాలతో పోరాడాల్సిన అవసరం ఉంది.