byసూర్య | Sun, Mar 29, 2020, 01:00 PM
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో చికెన్, మటన్, కోడిగుడ్ల రేట్లు ఊహించని రీతిలో పడిపోయాయి. మొన్నటి వరకు కొనేవారు లేక చికెన్, మటన్ షాపులు దివాళా తీశాయి. ఒక దశలో కేజీ 30 రూపాయలు పలికిన చికెన్ ధర గ్రామాల్లో ఫ్రీగా కూడా కోళ్లను పంచారు. ఇందుకు కారణం చికెన్, మటన్ తింటే కరోనా వస్తుందనే ఒక అపోహే. ఇదంతా రెండ్రోజుల క్రితం పరిస్థితి. చికెన్ వల్ల కరోనా రాదని సాక్ష్యాత్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశారు. దీంతో నిన్న, ఇవాళ చికెన్, మటన్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మాంసం షాపుల దగ్గర రద్దీ నెలకొంది. షాపుల దగ్గర జనాలు బారులు తీరారు. ప్రస్తుతం కేజీ చికెన్ రూ.180-200 ఉండగా.. కేజీ మటన్ 800 రూపాయలుగా ఉంది. అయినప్పటికీ జనాలు మాత్రం చికెన్ షాపులకు క్యూ కట్టారు. మరోవైపు మటన్ షాపుల దగ్గర కూడా ఇదే పరిస్థితి. అయితే షాపుల దగ్గర సామాజిక దూరం పాటించకుండా ప్రజలు ఎగబడుతున్నారు. సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, సెలబ్రిటీలు పదే పదే మొత్తుకుంటున్నప్పటికీ జనాలు మాత్రం కొన్ని చోట్ల అస్సలు పట్టించుకోవట్లేదు.