byసూర్య | Sun, Jan 12, 2020, 06:19 PM
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చేసిన ఒక సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణాలో తమకు ఎదురులేదని నిరూపించుకోవాలని టీఆర్ఎస్, పునర్వైభవాన్ని సాధించాలని కాంగ్రెస్, లోక్ సభ ఎన్నికల స్ఫూర్తిని కొనసాగించాలని బీజేపీ భావిస్తుండగా, సత్తా చాటాలని స్వతంత్ర అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ సర్వేలో తాజాగా మీ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగి మిమ్మల్ని ఎప్పుడైనా లంచం అడిగారా అనే అంశంపై సర్వే చేస్తే.. తెలంగాణ ప్రజల్లో 73.38 % మంది అవును అనే అభిప్రాయం వ్యక్తం చేయగా మిగతా 26.62%వారు లేదని తెలిపారు. ప్రభుత్వ అధికారుల్లో రోజురోజుకీ అవినీతిపరులు పెరిగిపోతున్నారని అభిప్రాయపడ్డారు. చేయి తడపనిదే ఫైలు కదలడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి రహిత పాలనపై పాలకులు వ్యాఖ్యానిస్తున్నా అది ఆచరణలో సాధ్యం కావడం లేదని తెలిపారు. రెవిన్యూ శాఖలో ఈ జాడ్యం ఎక్కువగా ఉందని, అందుకే ఇటీవల అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషించారు. ప్రభుత్వాధికారులు ప్రజలకు జవాబుదారులుగా వ్యవహరించాలని సూచించారు...అవినీతిని కూకటివేళ్లతో పెకిలించేందుకు అధికారులు నడుంబిగించాలని సూచించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజల నుండి ఇదే అభిప్రాయం వ్యక్తమైంది.