byసూర్య | Sat, Jan 11, 2020, 04:41 PM
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా ఎక్కువవుతున్నాయి. చాలా మంది సులభంగా డబ్బును సంపాదించాలనే దారులను వెతుక్కుంటున్నారు. మరికొందరు సామాన్యులను అడ్డుగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బును సంపాదించే పనిలో పడిపోయారు. పోలీసులు ఎప్పటికప్పుడు నేరాలను అదుపు చేస్తున్నా సైబర్ నేరగాళ్ల చర్యలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్, సోషల్ మీడియా సైట్లలో తాము పెట్టుకుంటున్న ఫోటోలే ఇప్పుడు వారికి చేటును కలిగిస్తున్నాయి. ఫోటో మార్పింగ్ చేసి బెదిరింపులకు పాల్పడుతూ సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
ఇటీవల ఎక్కువగా నమోదయ్యే నేరాలు అకౌంట్ టేకోవర్కు సంబంధించినవే. ఈ సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెయిల్స్ను హ్యాక్ చేస్తారు. అన్ సెక్యూర్డ్ ఈ-మెయిల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని.. నగదు చెల్లించాల్సిన వ్యక్తికి, నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెయిల్ లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వస్తాయి. అందుకే.. ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తరువాతే డిపాజిట్ చేయడం ఉత్తమం.
సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నామని నమ్మబలుకుతారు. ఈ-మెయిల్ ఐడీ, సెల్ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహువుతి ఇస్తామంటూ కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గరనుంచి, ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి, తమ పని కానిచ్చేస్తుంటారు. మేము పలానా బ్యాంకు నుంచి మెయిల్ చేస్తున్నాం… భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయకుండా చర్యలు తీసుకుంటాం… అంటూ వచ్చే ఈ-మెయిల్స్కు స్పందించారో మీ ఖాతా ఖాళీ అయిపోయినట్లే. ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98లక్షల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నట్లు అంచనా. ఇక ఎస్ఎంఎస్ ల ద్వారా కూడా ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త సుమా..