byసూర్య | Mon, Oct 14, 2019, 04:23 PM
ఈనెల 19వ తేదీన తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చిందని… కార్మికుల ఆవేదన అర్థం చేసుకోవాలని జనసేన తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఖమ్మంలో శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ రాణీగంజ్లో సురేందర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికులు ఆత్మార్పణం చేసుకోవడం బాధాకరమని జనసేన వ్యాఖ్యానించింది. ఇకపై ఇలాంటి బలిదానాలు జరగకూడదని పార్టీ ప్రకటనలో తెలిపింది. 48 వేలమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం ఉద్యోగ వర్గాల్లోనే కాదు సాధారణ ప్రజానీకంలోనూ ఆవేదన రేకెత్తిస్తుందని జనసేన అభిప్రాయపడింది. సమ్మె మరింత ఉధృతం కాకుండా సమస్యను పరిష్కరించాలని జనసేన కోరింది.