byసూర్య | Sat, Aug 24, 2019, 08:59 PM
వర్షాభావ పరిస్థితుల వల్ల రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితి నెలకొంది.. ఈ పరిస్థితిని అధిగమించి భూగర్భ జలాలు పెంపొందించుకునేందుకు నిజామాబాద్ పట్టణంలో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. వర్షపు నీటిని వృథా పోనీయకుండా బొట్టు బొట్టును ఒడిసి పట్టుకుని భూమిలో ఇంకే విధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంకుడు గుంతలను నిర్మించారు. దీంతో అక్కడ కురిసిన వర్షపు నీరంతా భూమిలో ఇంకిపోయి, భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం నుంచి కాపాడేందుకు ఆస్కారం కలిగింది. ఇదిలా ఉంటే ప్రతీ ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన వారు కచ్చితంగా ఇంకుడు గుంత నిర్మించాలి లేదంటే పర్మిషన్ ఇవ్వమని రూల్స్ తీసుకువచ్చింది. దీంతో ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటయ్యాయి. ఇదే క్రమంలో నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. దీంతో ఈ మైదానంలో కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ మైదానంలో మూడు చోట్ల ఇంకుడు గుంతలను నిర్మించారు.
ఒకటి భవనం పై నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా పోకుండా నిర్మించారు. మరొకటి మైదానంలోని నీరు బయటకు వెళ్లకుండా ప్రహరీ గోడ పక్కన సువిశాలమైన ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. మరో పక్కన మరో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు.. ఇలా ఈ కళాశాలలో మూడు చోట్ల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు దీంతో వర్షపు నీరు బొట్టు కూడా వృధా పోకుండా ఇంకుడు గుంతలోకి చేరుతున్నాయి. కళాశాల ప్రాంగణంలో చేపట్టిన ఇంకుడు గుంతల ప్రయోగం సఫలం అవ్వడంతో, విద్యార్థులు కూడా వారి ఇళ్లలో ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.