డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. ఆన్లైన్లో స్థానిక భాషలోనే విషయాలను పొందడానికి, రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పరివర్తనకు మద్దతు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. స్థానిక భాషలోనే సమాచారాన్ని పొందేందుకు నవ్లేఖ అనే కొత్త టూల్ను ప్రవేశపెడుతున్నది. గూగుల్ సంస్థ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ మాట్లాడుతూ ఇప్పటికే తమ కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించి తెలంగాణకు విశ్వసనీయ బాగస్వామిగా ఉన్నదని తెలిపారు. త్వరలో రెండో అతిపెద్ద క్యాంపస్ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నదని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఇంటర్నెట్ ద్వారా స్థానిక భాషలో సమాచారం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గూగుల్ ఇండియా అండ్ సౌత్ ఏషియా డైరెక్టర్ చేతన్ కృష్ణ స్వామి పాల్గొని ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.