byసూర్య | Sat, Jun 22, 2019, 09:04 AM
ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించి బస్సులోని మహిళ కండక్టర్పై దాడికి చేసిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలుఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా వైపు వెళుతున్న ఆర్టీసి బస్సులోకి అశ్వారావుపేట రింగ్రోడ్డు వద్ద బస్సు ఎక్కిన ఓ వ్యక్తి సత్తుపల్లికి టికెట్ ఇవ్వమని కండక్టర్ను అడిగాడు. తీరా కండక్టర్ టిక్కెట్ కట్ చేసి చేతికిస్తూ డబ్బులు ఇవ్వమని అడగ్గా.. డబ్బులు లేవని చెప్పడంతో బస్సు కాసేపు నిలపి వేసారు. ఇది కుదరదని, టిక్కెట్ కట్ చేసినందున డబ్బులు ఇవ్వాల్సిందేనని కండక్టర్ చెపుతున్న దశలో ఆ ప్రయాణీకుడు తన జేబులోంచి కత్తి తీసుకుని దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్చల్ చేసిన సైకో వారిస్తున్న బస్సులోని ప్రయాణీకుల మీద దాడి చేసాడు. ఈ దాడిలో కండక్టర్తో పాటు ఓ ప్రయాణీకుడికీ గాయాలయ్యాయి. ఆపై బస్సు దిగి పక్కనే ఉన్న మామిడి తోటలోని పారిపోయాడు. దీంతో ఆతన్ని వెంబడించిన ప్రయాణికులు మామిడి తోటలో పట్టుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. ఆతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసారు.