byసూర్య | Mon, Jan 21, 2019, 08:36 PM
ఎన్నికల సంఘం వైఫల్యాలను ఎండగడుతూ 24 న ధర్నా చేయనున్నట్లు మాజీ మంత్రి ఎం.శశిధర్ రెడ్డి తెలిపారు. సోమవారం గాంధీ భవన్ లో శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన అధికారులను మండలించకపోవడం దుర్మార్గపు చర్య అన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 25 లక్షల ఓట్లు గల్లంతు అయ్యాయన్నారు. సాక్షాత్తు ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్వయంగా క్షమాపణ చెప్పారు. నగరంలో ప్రతి నియోజకవర్గంలో ఓట్లను తొలంగించారు. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా అడ్డదారులు తొక్కారు. తెలంగాణ ప్రజలను మోసం చేసే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వ కనుసన్నల్లోనే ఎన్నికల అధికారులు పని చేశారని, కావాలనే కుట్ర పన్ని ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని పదే పదే విన్నవించినా కూడా పట్టించుకోలేదు. గుళ్ళు, గోపురాలు తిరుగుతూ ప్రజలను పట్టించుకునే దుస్థితిలో కేసీఆర్ లేరన్నారు.ఇంటి నంబరు లేకుండానే ఓటు హక్కును ఎలా ఇస్తారని, దేశ చరిత్రలోనే ఒక ఎన్నికల అధికారి తప్పులు జరిగాయని క్షమాపణ చెప్పడం ఇదే మొదటి సారన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 12 శాతం ఓట్లను తొలగించారు. కాంగ్రెస్ ను ఓడించాలనే కుట్రతోనే ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు.