byసూర్య | Mon, Jan 21, 2019, 08:05 PM
తెలంగాణ రాజకీయాలపట్ల, తెలంగాణ ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, స్ఠార్ క్యాంపెయినర్ విజయశాంతి మరో సారి మండిపడ్డారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రత్యామ్నాయ కూటమి అవసరమని, అందుకోసం జాతీయ నాయకుల మద్దత్తు కూడగడతానని దేశం మొత్తం తిరిగొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రికి నిరాశే ఎదురయ్యిందని విజయాశాంతి ఆరోపించారు. మూడవ ఫ్రంట్ అంశంలో చంద్రశేఖర్ రావును జాతీయ నేతలు విశ్వశించకపోవడంతో వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులకు పాల్పడ్డారని విమర్శించారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశమంతా తిరిగి చివరకు వైసీపీ మద్దతు మాత్రమే పొందగలిగారనే విషయం అర్థమయిందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కలిసిన బెంగాల్ సీఎం మమత బెనర్జీ, కర్నాటక సీఎం హెచ్ డీ. కుమారస్వామి, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, ఎం.కే స్టాలిన్ వంటి నేతలు కోల్ కతా లో జరిగిన మహాకూటమి సభకు హాజరయి బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కి మద్దతు పలికారని గుర్తు చేశారు. అంటే టీఆర్ఎస్ నేతృత్వంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అవుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన పార్టీల మద్దతు లేకుండా ఏర్పడబోయే ఫ్రంట్ ను ఫెడరల్ ఫ్రంట్ అనడం కంటే ఫెడప్ ఫ్రంట్ అనాలని రాములమ్మ తేల్చి చెప్పారు.