byసూర్య | Sat, Jan 19, 2019, 03:34 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని రకాల ఆదాయ మార్గాలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఆదాయ మార్గాల పెంపునకు సంబంధించి ఇప్పటికే సంస్థ ఉన్నతాధికారులు అవసరమైన కసరత్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా బస్భవన్లో ఆర్టిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్థిక), సంస్థ కార్యదర్శి పురుషోత్తం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో సంస్థకు చెందిన ఇతర అధికారులతో పాటు హెచ్పిసిఎల్, ఐఒసిఎల్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు. సంస్థ ఖాళీ స్థలాల వినియోగంపై చర్చించారు. ఇందులో ప్రధానంగా ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు, వాటి నిర్వహణతో పాటు ఆదాయం పెంపుదలకు సంబంధించిన అంశాలపై కూడా ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించారు. అయిల్ అవుట్లెట్ ప్రదేశాల్లో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా సేల్స్ రూమ్లు, టాయ్లెట్లు, పెడ్లు వంటి వాటిని సమకూర్చాలని ఇడి సూచించారు. ఇంధన అవుట్లెట్స్ నిర్వహణ వల్ల ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని సత్వరమే పరిష్కరించాల ని ఆయన సూచించారు. అప్పుడే అనుకున్న లక్షాలను చేరే అవకాశముంటుందనే అభిప్రాయాన్ని ఇడి పురుషోత్తం వ్యక్తం చేశారు. సంస్థ లక్షాలను సాధనకు అధికారులతో పాటు అయిల్ కంపెనీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇందుకోసం ప్రొవైడర్లు, అకౌంట్స్ అధికారులు, డిపో మేనేజర్లతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా ఇడి పురుషోత్తం ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. దీంతో పాటు సంస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు ఎక్కడె క్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, వాటిని ఎలా వినియోగించుకోవాలనే దానిపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. సంస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన ఆదాయ మార్గాల పెంపునకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.