by సూర్య | Fri, Jan 08, 2021, 03:38 PM
ఎప్పుడూ ఇతరులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. నిత్యం వివాదాల్లో ఉండే బాలీవుడ్ నటి కంగన రనౌత్ భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఎందుకు చిత్రవధకు గురిచేస్తున్నారంటూ ప్రశ్నించారు. "మానసికంగా, భావోద్వేగాల పరంగా, భౌతికంగా ఎందుకు హింసిస్తున్నారు? ఈ దేశం నుంచి నేను జవాబులు తెలుకోవాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నేను మీ పక్షాన నిలిచాను, ఇప్పుడు మీరు నాకు మద్దతుగా నిలివాల్సిన సమయం వచ్చింది.. జైహింద్" అంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కంగనా తన గళాన్ని బలంగా వినిపించారు. ఇండస్ట్రీలో చీకటి కోణాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముంబయిలోని ఆమె కార్యాలయాన్ని అధికారులు పాక్షికంగా కూల్చివేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పలువురు రాజకీయ నేతలు సైతం కంగనాను టార్గెట్ చేశారు. అటు ఇండస్ట్రీలోని ఓ వర్గం సైతం కంగనాపై విరుచుకుపడుతుంది. ఇలాంటి తరుణంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.