చేవెళ్లలో గెలుపే లక్ష్యంగా కొండా వ్యూహం.. 'సంకల్ప పత్రం' పేరుతో ప్రత్యేక మేనిఫెస్టో

byసూర్య | Fri, Apr 26, 2024, 07:31 PM

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. చేవెళ్ల నుంచి బరిలోకి దిగుతున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి.. తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి.. తన పార్టీ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం "సంకల్ప పత్రం" పేరుతో ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. తాను ఎంపీగా గెలిస్తే... రాబోయే ఐదేళ్లలో నియోజకవర్గ ప్రజలకు చేయనున్న పనులను ఈ సంకల్ప పత్రంలో పేర్కొని.. ప్రజలకు వివరించనున్నారు.


చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఈ సంకల్ప పత్రాన్ని కొండా విశ్వేశ్వర రెడ్డి విడుదల చేశారు. చేవెళ్లను దేశంలోనే అత్యుత్తమ పార్లమెంట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసమే ఈ సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. అత్యంత వైవిధ్యత కలిగిన చేవెళ్ల నియోజకవర్గంలో 29 లక్షల మంది విభిన్న కులాలు, మతాలు, భాషా బేధాలు కలిగిన వారు ఉన్నారని.. అన్ని వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుగుణంగా తన సంకల్ప పత్రాన్ని రూపొందించినట్లు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.


చేవెళ్ల ప్రాంతానికి.. విద్య, వైద్యంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తానంటూ కొండా ప్రకటించారు. కేంద్రం నిధులతో విద్య, వైద్యం కల్పించడంతో పాటు ప్రైవేట్ స్కూలు, ఆసుపత్రిలో విషయంలో నియంత్రణ చర్యలు చేపడతానన్నారు. గోవా తరహాలో కమ్యూనిటీ స్కూల్స్ తీసుకొచ్చి అధిక ఫీజుల భారం లేకుండా చేస్తానని భరోసా ఇచ్చారు. ముఖ్యయంగా.. నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలిపారు. భారీ పెట్టుబడులతో కంపెనీలను తీసుకురావడంతో పాటు.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులకు స్కిల్ డెవలప్ మెంట్ కోర్సుల్లో శిక్షణను ఇప్పించి ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.


తాండూరు కందిపప్పుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ తీసుకురావడంలో తానే ముఖ్య పాత్ర పోషించానని కొండా విశ్వేశ్వర రెడ్డి వివరించారు. స్థానికంగా పండే పంటలకు అధిక ధరలు దక్కేలా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. చేవెళ్లను నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిల్లెట్స్ హబ్‌గా తీర్చి దిద్దుతానన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.


పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు.. కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తానని కొండా హామీ ఇచ్చారు. అంత్యోదయ స్ఫూర్తితో తాను ఎంపీగా ఎన్నికైన వెంటనే చేవెళ్ల ప్రాంతంలోని అర్హులందరికీ ఇండ్లు, జీవనోపాధి కోసం లోన్లు కల్పిస్తానని కొండా పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను చేవెళ్లలో ప్రజలకు అందేలా చూస్తానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.


బీజేపీ మరోసారి అధికారంలోకొస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయి అన్న ప్రతిపక్షాల విమర్శలను కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిప్పి కొట్టారు. అంబేద్కర్ చెప్పిన మార్గంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారని కొండా గుర్తు చేశారు. బీజేపీ సర్కార్ కేవలం మతపరమైన రిజర్వేషన్లు మాత్రమే ఎత్తివేస్తుందని.. వాటి ద్వారా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరిస్తుందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.


Latest News
 

నేడు కౌకుంట్లకు డీకే అరుణ రాక Thu, May 09, 2024, 11:24 AM
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న హత్యలు Thu, May 09, 2024, 11:23 AM
హైదరాబాద్‌లో నేడు ‘జీరో షాడో డే’ Thu, May 09, 2024, 11:22 AM
నేడు భునవగిరిలో అమిత్‌ షా ప్రచారం Thu, May 09, 2024, 10:36 AM
రైతులందరికీ అలర్ట్.. మీ ఫోన్‌కు పీఎం కిసాన్, రైతుబంధు మెస్సేజ్ వచ్చిందా.. అయితే జాగ్రత్త Wed, May 08, 2024, 10:15 PM