byసూర్య | Tue, Oct 15, 2024, 07:19 PM
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పంటలు సాగు చేసే రైతులకు తీపి కబురు. ప్రస్తుతం ఆయా రైతులు కూరగాయలు, పండ్లు పండిస్తుండగా.. వాటిని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్, సమీపంలోని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. అయితే పెట్టుబడి, రవాణా ఖర్చులు, కొంత లాభం వేసుకుని వాటిని అమ్మేసుకుంటున్నారు. ఇక నుంచి రైతులకు రవాణా ఇబ్బందులు తలెత్తకండా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్, వ్యవసాయేతర పనులు చేస్తున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఎలాంటి పండ్లు, కూరగాయలు తింటున్నామో తెలుసా..
పండ్లు కూరగాయలు పండిస్తున్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల రైతులకు చేయూతనందించేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టనుంది. వ్యవసాయ, వ్యవసాయేతర అంకుర సంస్థలను స్థాపించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు ఇప్పటికే సన్నాహాలు మెుదలుపెట్టారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అన్నదాతల వద్దకే వెళ్లి..కూరగాయలు, పండ్లను కొనుగోలు చేసేందుకు అవసరమైన స్టార్టప్ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పండ్లు, కూరగాయలను పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే రైతులకు చేయూతను ఇచ్చే విధంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంకుర సంస్థల ఏర్పాటుతో హైదరాబాద్ నగరానికే కాకుండా బెంగళూరు, చెన్నై, ముంబయి వంటి నగరాలకు ఇక్కడ పండిన పండ్లు, కూరగాయలు, పూలను పంపించేందుకు నెట్వర్క్ ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆయా నగరాల్లోని ఫైవ్స్టార్ హోటళ్లు, కార్పొరేట్ సంస్థలు, ఇతర కంపెనీలకు ఈ పంట ఉత్పత్తులు పంపించనున్నారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 75 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లు, పూలను రైతులు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. కూరగాయలు, పండ్లను ఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోని మార్కెట్లకు రైతులు తరలిస్తున్నారు. అయితే వారికి ఆ రవాణా టెన్షన్ లేకుండా అకుంర సంస్థల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ట్రాన్స్పోర్టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. త్వరలోనే ఈ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు కానుండగా.. రైతులు తమ పంటలను లాభదాయకంగా విక్రయించనున్నారు.