byసూర్య | Tue, Oct 15, 2024, 07:17 PM
తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధిపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. పలు కొత్త ట్రైన్ మార్గాలను ప్రతిపాదించారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న మూడు స్టేషన్లతో పాటుగా చర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక రాష్ట్రంలో మరో కొత్త రైల్వే జంక్షన్ కూడా అందుబాటులోకి రానుంది. ఏపీలోని గుంటూరు-నడికుడి మార్గంలో నల్గొండ జిల్లా సరిహద్దులో విష్ణుపురం రైల్వేస్టేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్టేషన్ను రైల్వే జంక్షన్గా మార్చాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయించారు.
దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 20 వేల మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలోనే అతిపెద్ద థర్మల్ ప్లాంటును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సమీపంలోనే ఈ విష్ణుపురం రైల్వే స్టేషన్ ఉంది. యాదాద్రి థర్మల్ ప్లాంటుకు ప్రతిరోజూ 21 రైల్వే వ్యాగన్లలో కరీంనగర్ రామగుండం నుంచి బొగ్గు ట్రాన్స్పోర్టు చేయాల్సి ఉంటుంది. జాన్పహాడ్ మార్గంలో ప్రస్తుతం ఉన్న ట్రైన్ లైనుకు అదనంగా మరోలైను నిర్మిస్తున్నారు. వీటన్నింటిన దృష్టిలో ఉంచుకొని విష్ణుపురం స్టేషన్ను జంక్షన్ చేయాలని అధికారులు ప్రతిపాదించారు. సాధారణంగా మూడు ట్రైన్ మార్గాలు కలిసే స్టేషన్ను జంక్షన్గా మార్చేందుకు వీలుంటుంది.
గుంటూరు-బీబీనగర్ రైల్వే లైను ప్రస్తుతం ఒకే మార్గంగా ఉంది. దీన్ని తాజాగా రెండు వరసలుగా విస్తరిస్తున్నారు. మిర్యాలగూడ -గుంతకల్లు రైల్వే లైను సైతం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ట్రైన్లు అందుబాటులోకి వస్తే విష్ణుపురం రైల్వే స్టేషన్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక గుంటూరు, జాన్పహాడ్ లైను, వీర్లపాలెం థర్మల్ ప్లాంటు ట్రైన్ మార్గాలు సైతం ఇక్కడ కలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ జంక్షన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రైల్వే లైన్ల నిర్మాణ పనులు సాగుతుండగా.. త్వరలోనే జంక్షన్కు అవసరమైన విద్యుత్తు, రైల్వే సురక్షిత సౌకర్యాలు కల్పించనున్నారు.
భవిష్యత్తులో ట్రైన్ ప్రమాదాలు జరగకుండా నియంత్రించే ‘కవచ్’ టెక్నాలజీని సైతం ఇక్కడ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంటుకు 5 కిలోమీటర్ల మేరకు రైల్వే లైను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుసంధానంగా రైల్వే జంక్షన్లో అవసరమైన పనులు జరిపించాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు.