byసూర్య | Mon, Sep 30, 2024, 04:57 PM
మంత్రి శ్రీధర్ బాబు చదువుకున్నవాడని, సంస్కారం ఉన్నవాడని తమకు గౌరవం ఉండేదని, కానీ ఆయనకు సహవాస దోషం అంటుకున్నట్లుగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఓటుకు నోటు దొంగలతో కలిసి కూర్చొని శ్రీధర్ బాబు కూడా చెడిపోయారన్నారు. అందుకే సంస్కారవంతుడైన శ్రీధర్ బాబు కూడా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మూసీ బాధితులు ఏడుస్తుంటే కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.5 వేల రూపాయల కోసమే వారు మాట్లాడుతున్నారని ఓ మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ వారి వలె ప్రజలు ఉండరని గుర్తించాలన్నారు. రూ.50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని అమ్ముకోవడం, రూ.500 కోట్లకు సీఎం పదవిని అమ్ముకోవడం, మంత్రులు ఒక్కొక్కరు పర్సెంటేజీలు పంచుకొని... ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం కాంగ్రెస్ వాళ్లకే సాధ్యమన్నారు. కానీ ఈ కాంగ్రెస్ నేతల దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు లేవన్నారు.గూడు చెదిరి పిల్లలు, మహిళలు ఏడుస్తుంటే శ్రీధర్ బాబు మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఆత్మగౌరవం మీద కొడితే తెలంగాణ ప్రజలు తిరగబడతారని, ఊళ్లలో తిరగలేని పరిస్థితి వస్తుందని శ్రీధర్ బాబు తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం శ్రీధర్ బాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయన మీద గౌరవం పోతోందన్నారు. మొన్ననేమో పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య కొట్లాట అని అతితెలివి ప్రదర్శించారని, నిన్ననేమో రూ.5 వేల కోసం బూతులు తిడుతున్నారని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇళ్లను కూలగొడితే సామాన్యులు తిట్టకుండా దేవుడిలా చూసి మొక్కుతారా? అని ప్రశ్నించారు.