byసూర్య | Mon, Sep 30, 2024, 03:12 PM
డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ ప్రాణం బలైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నామపూర్ గ్రామానికి చెందిన సల్కం మనోజ్ఞ (4) అనే విద్యార్థిని మహర్షి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.ఉదయం స్కూల్ ఆవరణలో చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా.. డ్రైవర్ పాపను గమనించకుండానే వ్యాన్నురివర్స్ తీశాడు. ఈ క్రమంలో మను తలపై నుంచి వ్యాన్ వెళ్లడంతో తల నుజ్జునుజ్జై అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటి వరకు ఆడతూ..పాడుతూ తిరిగిన తమ పాప విగత జీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు గుండెలు అవిసేలా రోదించారు. పాఠశాల కరెస్పాండంట్ విదేశాల్లో ఉండి బాగోగులు పట్టించుకోకపోవడం వల్లే ఇంతటి దారుణం జరిగిందని మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని, బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని పలు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టాయి.