హైదారాబాద్‌లో మరో కొత్త మార్గంలో మెట్రో.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

byసూర్య | Wed, Sep 25, 2024, 07:34 PM

హైదరాబాద్‌లో మెట్రో రైలు మార్గాన్ని విస్తరించేందుకు కసరత్తును వేగవంతం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కొత్త మార్గంలో మెట్రో లైన్ వేయాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఇప్పటికే.. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు, ఎల్బీనగర్‌ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు మెట్రో విస్తరణ పనులు వేగంగా జరుగుతుండగా.. ఇప్పుడు కొత్తగా ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి కూడా మెట్రో మార్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు.. ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని సంబంధిత అధికారులకు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.


మరోవైపు.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు, మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌పై పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని అధికారులకు సీఎం రేవంత్ కీలక సూచనలు చేశారు.


అయితే.. ఫ్యూచర్ సిటీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతి వేదికపై దీని గురించి ప్రస్తావిస్తూనే ఉన్నారు. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ ఫ్యూచర్ సిటీలోనే ఏర్పాటు చేయనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే.. సైబర్ సిటీకి ధీటుగా ఫ్యూచర్ సిటీని రూపుదిద్దనున్నట్టు ప్రతిసారీ చెప్తున్న రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అక్కడికి మెట్రో రైలును కూడా విస్తరించేలా చర్యలు తీసుకుంటుండటం గమనార్హం.


బాధితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు..


ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని, అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువుల పరిరక్షణ ఒక బాధ్యతగా చేపట్టాలని.. చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని సూచించారు.


చెరువులు వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు


చెరువుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు అన్నింటికీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతీ చెరువు, నాలాల ఆక్రమణల వివరాలతో పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


Latest News
 

ఫార్మా సిటీని రద్దు చేయడం లేదని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిందన్న కేటీఆర్ Thu, Sep 26, 2024, 08:37 PM
అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం Thu, Sep 26, 2024, 07:37 PM
మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం నుంచి డిమాండ్ వస్తున్నట్లు మంత్రి సీతక్క వెల్లడి Thu, Sep 26, 2024, 07:35 PM
లాడ్జిలో ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య Thu, Sep 26, 2024, 07:14 PM
పేదలకు అన్యాయం జరగకుండా అండగా ఉంటాం: ఎమ్మేల్యే Thu, Sep 26, 2024, 07:13 PM