'రేవంత్ సార్ ఇల్లు కూలగొడితే బుక్స్ పోయినయ్'.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారి మాటలు

byసూర్య | Tue, Sep 24, 2024, 10:00 PM

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా చేపట్టిన కూల్చివేతలు వివాదాస్పదం అవుతున్నాయి. గత నెల రోజులకు పైగా హైడ్రా అధికారులు చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన వందల అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ కూల్చివేతల్లో పెద్దల ఇండ్లను వదిలి మధ్యతరగతి వారు సామాన్యుల ఇండ్లను కూల్చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పెద్దల నిర్మాణాలకు నోటీసులు ఇచ్చి.. పేదల ఇండ్లకు మాత్రం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కనీసం ఇంట్లోని సామాన్లు కూడా తీసుకోవటానికి సమయం లేకుండా ఉన్నపళంగా కూల్చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.


రిజిస్ట్రేషన్ చేసుకున్న మూడు రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలపిస్తుంటే.. తన కష్టాన్నంతా దారపోసి మూడేళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. ఇండ్లు కోల్పోయిన బాధితుల కథ వింటే కన్నీళ్లు పెట్టాల్సి వస్తోంది. తాజాగా.. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ ఇంటిని రేవంత్ సార్ కూల్చేశారంటూ ఓ ఐదేళ్ల చిన్నారి చెప్పిన మాటలు అందరిచే కంటతడి పెట్టిస్తున్నాయి. ఇల్లు కూల్చేయటంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని.. తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది.


'రేవంత్ సార్ మా ఇల్లు కూలగొట్టిండు. మా మమ్మీ, డాడీని పోలీస్ స్టేషన్‌కు తీసుకుపోయిన్రు. మేం ఏడ్చినా వదల్లేదు. మా టీచర్ వాళ్లు కాల్ చేసి ఎందుకు స్కూల్‌కు రాలేదని అడుగుతున్నరు. నా బుక్స్ అన్ని పోయినయ్ అని చెప్పిన. ఇల్లు కూలగొడితే బుక్స్ అన్ని పోయినయ్ అని టీచర్‌కు చెప్పిన. నా బుక్స్, వాటర్ బాటిల్ రేవంత్ సార్ తెప్పియ్యాలి. మా డాడీ వాటర్ బాటిల్ కొనిపిస్తే అది కూడా పగలగొట్టిన్రు. మా మమ్మీడాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడి ఏడ్చిన.' అంటూ ఆ చిన్నారి చెప్పిన మాటలు విన్న ప్రతి ఒక్కరితో కంట తడి పెట్టించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎవరో చేసిన తప్పుకు ఆ పసి హృదయం బాధపడిందని.. ఇటువంటి చర్యల పట్ల ప్రభుత్వం పునరాలోచన చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.


కాగా, ఈ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు ఆయన నివాసాన్ని కూల్చలేదు. కూల్చివేతలపై కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో తిరుపతి రెడ్డిని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


'అనుముల తిరుపతి రెడ్డి గారు.. LKG చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడలా కూల్చివేయబడింది. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు. వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది. కోర్టులో స్టే సంపాదించుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో. మీ సోదరుడి బుల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Latest News
 

జంతు వ్యర్థాలతో నెయ్యి, నూనెలు.. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా తయారీ Wed, Sep 25, 2024, 08:46 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Wed, Sep 25, 2024, 08:45 PM
త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ.. మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 08:44 PM
సింగరేణి కార్మికులకు ,,,,అక్టోబర్ 9న అకౌంట్లోకి డబ్బులు Wed, Sep 25, 2024, 08:43 PM
యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న మల్లారెడ్డి Wed, Sep 25, 2024, 08:41 PM