byసూర్య | Tue, Jun 25, 2024, 09:48 PM
తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారగా.. దీనిపై విచారణ జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్... జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిషన్.. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు జూన్ 11వ తేదీన నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఆ నోటీసులపై 12 పేజీల లేఖతో ఘాటుగానే స్పదించారు. అయితే.. కమిషన్ మరోసారి కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. ఇప్పటి వరకు కమిషన్కు వచ్చిన సమాచారంపై కేసీఆర్ అభిప్రాయం ఏంటో చెప్పాలంటూ నోటీసుల్లో కమిషన్ అడిగింది.
అయితే.. రెండోసారి నోటీసులు ఈ నెల 19వ తేదీనే ఇవ్వగా.. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈ నోటీసులపై ఈ నెల 27వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ను కమిషన్ ఆదేశించింది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి, మరికొంత మందికి కూడా విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది.
కాగా.. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై ఇప్పటికే కేసీఆర్కు.. జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా.. ఈ నోటీసులకు గులాబీ బాస్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. విచారణను నిష్పక్షపాతంగా జరగట్లేదని.. కమిషన్ నుంచి ఛైర్మన్ నర్సింహా రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలంటూ కేసీఆర్.. 12 పేజీల లేఖ రాయటం సంచలంగా మారింది. కాగా.. ఇదే అంశంపై తాజాగా కేసీఆర్.. హైకోర్టుకు కూడా ఆశ్రయించటం గమానార్హం. ఈ కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ఓవైపు.. కేసీఆర్కు జస్టిస్ నర్సింహా రెడ్డి కమిషన్ రెండోసారి నోటీసులు ఇవ్వటం.. మరోవైపు ఈ కమిషన్ మీద గులాబీ బాస్ హైకోర్టును ఆశ్రయించటంతో.. ఈ అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మొదటిసారి ఘాటుగా స్పందించిన కేసీఆర్.. రెండోసారి కూడా నోటీసులు పంపటంపై ఎలా స్పందిస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.