byసూర్య | Tue, Jun 25, 2024, 09:44 PM
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఓ ప్రముఖ ఛారిటీ సంస్థల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనిఖీలు చేయటం.. ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విదేశాల నుంచి వచ్చిన విరాళాలను పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై 'ఆపరేషన్ మొబిలిటీ' (OM) అనే ఛారిటీ సంస్థపై ఈడీ దాడులు చేసింది. హైదరాబాద్ శివార్లలోని మొత్తం 11 ప్రాంతాల్లోని ఓం ఛారిటీ కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, డిజిటల్ డివైజ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. ఈ నెల 21, 22 తేదీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు ఈడీ మంగళవారం రోజున (జూన్ 25న) వెల్లడించింది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్, జర్మనీ, ఫిన్లాండ్, ఐర్లాండ్, మలేషియా, నార్వే, బ్రెజిల్, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, రొమేనియా, సింగపూర్, స్వీడన్ స్విజ్జర్ ల్యాండ్ వంటి 16 దేశాల నుంచి ఓఎమ్ ఛారిటీ సంస్థకు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చాయి.
అనాథలు, పేదల పిల్లలకు ఉచిత విద్య, భోజనం అందిస్తామని.. పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామంటూ ఓమ్ ఛారిటీ సంస్థ ప్రతినిధులు విదేశీ దాతల నుంచి రూ.300 కోట్లు సేకరించినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి సేకరించిన విరాళాలను పక్కదారి పట్టించినట్టు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టినట్లు ఈడీ పేర్కొంది. కాగా.. తెలంగాణతో పాటు ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఈ సంస్థకు చెందిన కార్యాలయాల్లో ఈడీ దాడులు నిర్వహించినట్టు సమాచారం.