byసూర్య | Tue, Jun 25, 2024, 08:02 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2011 రైల్రోకో కేసులో కేసీఆర్ విచారణకు హైకోర్టు స్టే విధించింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. 2011లో తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన రైలు రోకో సందర్భంగా పోలీసులు కేసీఆర్పై కేసు పెట్టారు. ప్రస్తుతం ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్లో ఉంది. కేసీఆరే రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ ప్రజాప్రతినిధుల కోర్టుకు పోలీసులు నివేదిక అందజేశారు.
2011 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో కేసీఆర్ రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ నివేదికలో వెల్లడించారు. రైలు రోకో వల్ల ట్రైన్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు రైల్వే ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం కలిగిందని నివేదికలో పోలీసులు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో అప్పటి కేసు కొట్టేయాలంటూ కేసీఆర్ సోమవారం ( జూన్ 24) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైనది తప్పుడు కేసు అని పిటిషన్లో పేర్కొన్నారు. రైల్ రోకోలో తన ప్రమేయం ఏమాత్రం లేదని చెప్పారు.
తాను ఎలాంటి రైలు రోకోకు పిలుపునివ్వలేదని అన్నారు. ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ కేసులో తానే నిందితుడిగా ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేవని.. కేసు కొట్టేయాలంటూ హైకోర్టును కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా కేసీఆర్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం విచారణపై స్టే విధించటంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.