byసూర్య | Tue, Jun 25, 2024, 08:03 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాఫిక్గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటంతో ఈ రగడ మెుదలైంది. తనకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా తాను ఏవరి మీదనైతే పోరాడో వారినే పార్టీలో చేర్చుకున్నారని జీవన్ రెడ్డి అలకబూనారు. ఉదయం పత్రికల్లో చూసి ఎమ్మెల్యే చేరిన వార్త తెలుసుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల తన సీనియారిటీకి అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలు గౌరవించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని జీవన్ రెడ్డి హితవు పలికారు.
ఈ క్రమంలో ఆయన్ను బుజ్జగించేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సోమవారం జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనతో మాట్లాడిన అలక వీడలేదు. తన రాజకీయ భవిష్యత్తుపై జీవన్ రెడ్డి తాజాగా కీలక ప్రకటన చేశారు. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పార్టీ మారుతున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టేశారు. పార్టీ మారే ఆలోచన లేదని చెప్పారు. తనను బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి ఎవరూ సంప్రదించలేదన్నారు. తన ప్రమేయం లేకుండా జరగాల్సిందిన జరిగిపోయిందని చెప్పారు.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాష్ట్రంలోని పల్లెపల్లెలో తిరుగుతానని అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కన పెట్టి పార్టీ కోసం నిలబడిన తనకు ఘోర అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కనీసం సమాచారం ఇవ్వకుండా ప్రత్యర్థి పార్టీలోకి చేర్చుకోవటం సరైంది కాదని తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ భేటీ అయ్యారు. ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. భట్టి బుజ్జగింపులతో జీవన్ రెడ్డి మెత్త బడతారా? లేదా ? అనేది వేచి చూడాలి మరి.