![]() |
![]() |
byసూర్య | Mon, Jun 24, 2024, 10:34 PM
ఉన్నత చదువులు చదివిన ఓ యువకుడు సాప్ట్వేర్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగంలో సెటిల్ కాటవంతో తల్లిదండ్రులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఆదివారం సెలువు దినం కావటంతో ఇంట్లోవాళ్లు పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేశారు. దీంతో శనివారం (జూన్ 22) రాత్రి హైదరాబాద్ నుంచి బైక్పై స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ టిప్పర్ లారీ మృత్యువు రూపంలో కబళించింది. వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో యువకుడు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన సుధాకర్, కృష్ణమ్మలకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు శివ శంకర్ (31) ఉన్నత చదువులు చదవి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మాదాపూర్లో ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ ఉద్యోగానికి వెళ్లేవాడు. చిన్న కుమారుడు పుట్టుకతోనే మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. పెద్ద కుమారుడికి పెళ్లీడు రావటంతో వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించుకున్నారు. దీంతో గతవారం పెళ్లి చూపుల కోసం స్వగ్రామానికి వెళ్లాడు. అయితే అమ్మాయి తరపు వాళ్లు ఆదివారం వస్తారని తల్లి చెప్పడంతో శనివారం రాత్రి బైక్పై ఇంటికి బయల్దేరాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1కు చేరుకోగానే.. వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వాహనం శివశంకర్ బైక్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో శివశంకర్ బైక్పై నుంచి కిందపడిపోటవంతో తలకు బలమైన గాయమై.. స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టగా.. టిప్పర్ లారీ ఢీకొట్టినట్లు గుర్తించారు. వాహనం నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాగా, పెళ్లీడుకు వచ్చిన కుమారుడు యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవటంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.