byసూర్య | Wed, Jun 19, 2024, 07:58 PM
తెలంగాణలో ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయి. అమెరికాకు చెందిన 'ది లాక్హీడ్-మార్టిన్' అనే సంస్థ ఇప్పటికే హైదరాబాద్ నగరం శివారులోని ఆదిభట్లలో తమ సంస్థను నెలకొల్పింది. ఏరోస్పేస్, రక్షణ వ్యవస్థలకు సంబంధించిన విడిభాగాలను ఈ సంస్థ ఉత్పత్తి చేస్తుంది.
కాగా, రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు కంపెనీ ఇండియా హెడ్ ఫెర్నాండేజ్ సహా కంపెనీ ప్రతినిధులు మంగళవారం (జూన్ 18) సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశమయ్యారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టే అంశంపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సంస్థ విస్తరణ పూర్తయితే వేల మందికి ఉపాధి లభించనుంది.
కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందం కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. హైదరాబాద్ వివిధ రంగాల్లో విస్తరిస్తూ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరును సమావేశంలో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ తమ అధ్యయన వివరాలను వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హైదరాబాద్లో లీజింగ్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ స్పేస్ కోసం పెరిగిన డిమాండ్తో రియాల్టీ రంగం గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెలువరించే నివేదిక జూలై నెలాఖరులో విడుదలవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. హైదరాబాద్ను ప్రపంచంలోనే పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని చెప్పారు. 'తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుంది. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడికి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగింది. న్యూయార్క్ వంటి నగరాలతో పోల్చుకునేలా హైదరాబాద్ను తీర్చిదిద్దాల్సి ఉంది.' అని రేవంత్ వ్యాఖ్యానించారు.