byసూర్య | Wed, Jun 19, 2024, 07:44 PM
ఆయిల్ పామ్, అంతర పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. రైతులు, కంపెనీలకు సంబంధించిన రూ.100.76 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల చేసినట్లు వెల్లడించారు. విడుదల చేసిన నిధులు 2-3 రోజుల్లో ఆయిల్ పామ్ తోటల నిర్వహణ, అంతర పంటల సాగు చేసే రైతుల అకౌంట్ల జమ చేస్తామన్నారు. ఈ మేరకు ఉద్యానశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని తెలిపారు. 2022-23 నుంచి పెండింగ్లో ఉన్న డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన రూ. 55.36 కోట్లను కూడా తమ ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.
ఆయిల్ పామ్, ఇతర పంటల్లో రైతులు అమర్చిన డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కంపెనీలకు పెండింగ్ బకాయిల కింద వీటిని జమ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2023-24 సంవత్సరానికిగాను తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్ పామ్ పంటను సాగులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించారు. పాత బకాయిలు తాజాగా విడుదల చేసిన నేపథ్యంలో... 2024-25 సంవత్సరంలో ఆయిల్పామ్ పంట సాగు లక్ష్యాన్ని అన్నదాతలు చేరుకునేలా వారిని ప్రోత్సహించాలని ఉద్యానశాఖ అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఇక రైతు రుణమాఫీపైనా కీలక కామెంట్స్ చేశారు. ఆగస్టు 15లోగా ఎట్టి పరిస్థితిలోనూ రూ. 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన కసరత్తు జరుగుతోందని చెప్పారు. ఈనెల 21న కేబినెట్ భేటీ ఉంటుందని భేటీలో అర్హులు, కటాఫ్ తేదీలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు.