byసూర్య | Wed, Jun 19, 2024, 07:34 PM
హైదరాబాద్ నగరంలో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. చార్మినార్, గోల్కండ వంటి చారిత్రక కట్టడాలతో పాటు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందర్నీ అలరించే నెహ్రూ జూలాజికల్ పార్క్ వంటివి ఉన్నాయి. హైదరాబాద్కు మెుదటి సారిగా వచ్చిన వారు అన్ని కట్టడాలతో పాటు జూ పార్కును కూడా కచ్చితంగా సందర్శిస్తారు. హైదరాబాద్ బహదూర్పురాలో 380 ఎకరాల్లో ఈ జూపార్క్ విస్తరించి ఉంది. అయితే త్వరలో హైదరాబాద్లో జూ పార్క్ కనిపిచందనే వార్తలు వినిపిస్తున్నాయి. జూ పార్క్ను సిటీ నుంచి దూరంగా తరలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు పలు పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి.
హైదరాబాద్లో జూ పార్కు అంతకుముందు పబ్లిక్ గార్డెన్స్లో కొన్ని ఎంక్లోజర్లలో ఉండేది. ఆ తర్వాత.. 1963లో బహదూర్పురాలో 380 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ సమంయలో అది సిటీకి దూరంగా ఉండేది. జూలోని జంతువులకు ఇబ్బందులు కలగకుండూ ట్రాఫిక్, కాలుష్యం తక్కువగా ఉండే ప్రాంతంలో జూపార్క్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం నగరం విస్తరించటంతో జూపార్క్ సిటీ మధ్యలో కలిసిపోయింది. జూపార్కు పరిసరాల్లో విపరీతమైన శబ్ద కాలుశ్యంతో పాటు వాయుకాలుష్యం పెరిగిందని పలువురి అభిప్రాయం. దానికి తోడు భారీ వర్షాలు కురిసినప్పుడు జూపార్కు సమీపంలో ఉన్న మీర్ ఆలం ట్యాంక్ నుంచి భారీగా వరద జూపార్కులోకి ప్రవేశిస్తుంది. దీంతో ఇక్కడి నుంచి జూపార్క్ తరలించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
1980 నుంచి జూపార్క్ తరలింపు ప్రతిపాదనలు ఉన్నాయి 2010లోనే జూ పార్క్ తరలిపోతుందని ప్రచారం జరిగింది. అయితే అది సాధ్య కాలేదు. తాజాగా ఇదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి దూరంగా.. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకు జూ పార్క్ తరలిస్తారని ప్రచారం జరుగుతోంది. కమ్మదనం రిజర్వ్ ఫారెస్ట్ 824 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఇది హైదరాబాద్ నగరానికి 45 కి.మీ దూరంలో ఉంది. ఇది నగరానికి దూరంగా ఉన్నందున అటువంటి కాలుష్యం లేకుండా జూ పార్కుకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు.
అయితే ఈ వార్తలను ఓ సీనియర్ అటవీ శాఖ అధికారి కొట్టిపారేశారు. జూ పార్కు తరలించటం అంత ఈజీ కాదని చెబుతున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రస్తుతం 1,500 కంటే ఎక్కువ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జూపార్కును వేరే చోటికి తరలించడం సవాలుతో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు. జూపార్కును మరో చోటికి తరలించాలంటే సెంట్రల్ జూ అథారిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సి ఉంటుందన్నారు.
జూ పార్క్ తరలింపు చాలా ఖర్చుతో కూడుకున్న పని అని.. ఒక్కో టైగర్ ఎంక్లోజర్కు రూ.2 నుంచి 3 కోట్ల వరకు ఖర్చవుతుందని అంటున్నారు. దానికి తోడు జంతువులు ఆయా ప్రాంతాలకు అలవాటు పడాలంటే కనీసం ఐదేళ్ల సమయం పడుతుందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుంటే జూ పార్కు తరలింపు సాధ్యమయ్యే పని కాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.