byసూర్య | Wed, Jun 19, 2024, 07:29 PM
మహిళలు, బాలికలకే కాదు.. వారిని రక్షించే రక్షకభటులకు కూడా రక్షణ లేకుండా పోయింది. కొందరు కామాంధులు బరితెగించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఎస్సై తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మహిళా కానిస్టేబుల్పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గన్తో బెదిరించి పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న భవానీ సేన్ స్టేషన్లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై కన్నేశాడు. ఆమెపు పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ భవానీ సేన్ కొత కొన్ని నెలలుగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విధుల్లో ఉన్న తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఎస్ఐ గన్తో బెదిరించినట్లు వాపోయింది.
జిల్లా ఎస్పీని కలిసి బాధితురాలు తన గోడును వెళ్లగక్కింది. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్ఐ భవానీ సేన్పై చర్యలు తీసుకున్నారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో గత అర్ధరాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐలతో విచారణ చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే గతంలో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించి ఎస్ఐ సస్పెండ్ అయినట్లు తెలిసింది. కాగా, ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐ భవానీ సేన్ను డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.