byసూర్య | Wed, Jun 19, 2024, 07:26 PM
హైదరాబాద్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై ఇటీవల కాలంలో టాస్క్ఫోర్స్, ఫుడ్ సెఫ్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఆ తనిఖీల్లో పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో దారుణ పరిస్థితులు వెలుగు చూశాయి. ఆహారం తయారీ కోసం ఉపయోగించే పదార్థాల్లో నాణ్యత లేకపోవటం, గడవు ముగిసిన ఆహార పదార్ధాలను వంటకు ఉపయోగించటం వంటివి వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. నగరంలోని పలు ప్రైవేటు హాస్టళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టగా.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
ఏ మాత్రం శుభ్రత లేకుండా ఆహార పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించారు. మాదాపూర్, ఎస్సార్ నగర్, కూకట్పల్లి ప్రాంతాల్లోని పలు వర్కింగ్ మెన్, ఉమెన్స్ హాస్టళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. హాస్టళ్లలోని కిచెన్స్లో దారుణ పరిస్థితులు గుర్తించారు. కాలం చెల్లిన ఆహార వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. చాలా యాజమాన్యాలు పాడైపోయిన వస్తువులతో ఆహారాన్ని తయారుచేస్తున్నాయి. కిచెన్లో ప్రమాదకర బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నట్లు గుర్తించారు. ఇటీవల హాస్టళ్లలో పదార్థాలు తిని చాలా మంది యవతీ యువకులు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు హాస్టళ్ల నిర్వాహకులకు టాస్క్ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.