byసూర్య | Wed, Jun 19, 2024, 07:23 PM
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని RVM మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతున్నారంటూ క్లాసులు బహిష్కరించి కాలేజీ ఎదుట నిరనస వ్యక్తం చేశారు. మానసికంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని.. ఓవర్ డ్యూటీలు వేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. ప్రస్తుతం ఉన్న అధ్యాపకులను తొలగించి వేరే అధ్యాపకులను నియమించాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన కాలేజీ యాజమాన్యం వారితో చర్చించేందుకు ప్రయత్నించింది. అయినా విద్యార్థినులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న అధ్యాపకులను తొలగించాల్సిందేనని భీష్మించుకుని కూర్చుకున్నారు. దీంతో కాలేజీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది.