byసూర్య | Wed, Jun 19, 2024, 07:20 PM
టెక్నాలజీ రోజు రోజుకూ మరింత అభివృద్ది చెందుతోంది. ప్రస్తుతం స్మార్ట్వాచ్లు హవా నడుస్తోంది. అవి మరింత అడ్వాన్స్డ్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్వాచ్లు మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. ఇక చాలామంది తమ హెల్త్ ట్రాకింగ్ కోసం, హార్ట్ రీడింగ్స్ కోసం ప్రముఖ యాపిల్ బ్రాండ్ స్మార్ట్ వాచ్లు వాడుతున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో యాపిల్ వాచ్లలో ఉండే అడ్వాన్స్డ్ ఫీచర్లు ప్రజల ప్రాణాలను కాపాడాయి. వాచ్ ధరించిన వారి ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసి.. సకాలంలో వారికి మెడికల్ ట్రీట్మెంట్ అందటంలో కీలక పాత్ర పోషించాయి.
తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాపిల్ స్మార్ట్ వాచ్ బీజేపీ నేత ప్రాణాలను కాపాడింది. ఆరోగ్య పరిస్థితిపై అలర్ట్ ఇచ్చి అతడి ప్రాణాలను నిలబెట్టింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణకు ఇటీవల ఒంట్లో బాగుండటం లేదు. నాలుగు అడుగులు వేస్తే చాలా ఛాతీలో మంటతో పాటు విపరీతమైన ఆయాసం వస్తుంది. అయినా ఆయన నిర్లక్ష్యం చేశారు. వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆయన గత కొన్ని రోజులుగా యాపిల్ బ్రాండ్ వాచ్ వాడుతున్నారు.
ఆ వాచ్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చింది. గుండెకు ఇబ్బంది ఉందని పసిగట్టి అలర్ట్ ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన ప్రతాప రామకృష్ణ వెంటనే ఆసుపత్రికి పరుగులు తీశారు. పరీక్షించిన వైద్యులు హార్ట్లో రెండు రక్తనాళాలు మూసుకుపోయినట్లు వెల్లడించారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.