byసూర్య | Tue, Jun 18, 2024, 09:24 PM
రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారంలో నష్టపోయిన ముగ్గురు స్నేహితులు ఈజీగా డబ్బు సంపాదించేందుకు స్కెచ్ వేశారు. ఓ వ్యాపారి ఇంట్లో రూ. 950 కోట్ల బ్లాక్ మనీ ఉందని తెలుసుకొని చోరీ చేసేందుకు ట్రై చేసారు. పక్కా స్కెచ్తో ఇంట్లోకి ప్రవేశించగా.. చివరి నిమిషంలో పోలీసులు రావటంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేసారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారు బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య, శేఖర్ రెడ్డి, మహమూద్ అనే ముగ్గురు స్నేహితులు. వీరు గతంలో రియల్ ఎస్టేట్, ఇసుక బిజినెస్ చేసి తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో అప్పులు తీర్చుకునేందుకు ఈజీగా మనీ సంపాదించేందుకు ప్లాన్ చేశారు.
తుర్కయాంజల్లో ఉండే ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ తురుమన తురై ఇంట్లో సుమారు రూ. 950 కోట్ల డబ్బు ఉందనే విషయాన్ని పాత వాచ్మెన్ ద్వారా జంగయ్య తెలుసుకున్నాడు. ఈ విషయాన్ని అతడు తన మిత్రులు శేఖర్ రెడ్డి, మహమూద్లకు చెప్పాడు. వీరు ముందుగా కూకట్పల్లి నుంచి ఒక పూజారిని తీసుకొచ్చి డబ్బు గురించి తెలుసుకునేందుకు పూజలు చేయించాలని పథకం రచించారు. అయితే చివరి నిమిషంలో పూజారి రాకపోటవంతో.. పెద్ది శ్రీనివాస్ అనే వ్యక్తిని సంప్రదించగా.. ఆ ఇంట్లో డబ్బు ఉన్నమాట వాస్తవమేనని చెప్పాడు.
ఆ తర్వాత తమకు తెలిసిన మహమూద్, రజాక్, జాకీ లఖానికి, సవూద్, ఆదిల్, ముదాసీర్, జాఫర్, ఇస్మాయిల్, ఖాదర్, అక్బర్, షమీలతో పాటు మరికొంత మందికి విషయం చెప్పారు. వీరంతా కలిసి దోపిడీ చేసేందుకు ప్లాన్ వేశారు. ఇనుప రాడ్లు, కత్తులు కొనుగోలు చేసి రెండు కార్లలో ఈనెల 5న వ్యాపారి ఇంటికి వెళ్లారు. వాచ్మెన్ ఉండడంతో వెనుదిరిగి వచ్చారు. మరోసారి ఈనెల 11న ప్లాన్ చేసుకుని.. ఈసారి వాచ్మెన్ అడొస్తే కొట్టి దోపిడీ చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా గోడ దూకి నలుగురు చొప్పున ఇంట్లోకి వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు.
అడ్డుకోబోయిన ఇద్దరు వాచ్ మెన్లను కొట్టి తాళ్లతో బంధించారు. ముగ్గురు వ్యక్తులు గ్రౌండ్ ఫ్లోర్లోని మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్లి.. చోరీకి యత్నించారు. అలకిడి విన్న ఇంటి యజమాని వెంటనే 100 కు కాల్ చేశాడు. పోలీసులు సైరన్ వేసుకుంటూ వెళ్లగా దొంగలు అక్కడ్నుంచి పారిపోయారు. ఓనర్ తురుమన తురై ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 15 మందిని అరెస్టు చేశారు. అయితే వ్యాపారి ఇంట్లో నల్లధనం ఏదీ లేదని.. అదంతా పుకార్లు అని పోలీసులు వెల్లడించారు.